Legal Community
న్యాయ వార్తా పోర్టల్
BREAKING
ACB

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు SI లు

Legal Community మార్చి 09, 2026 3 min read

 


ఇటీవల కాలంలో తెలంగాణలోని అనేక మంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు.

చిన్నా పెద్ద అని తేడా లేకుండా: ఆ శాఖ ఈ శాఖ అని మొహమాటం లేకుండా వివిధ మార్గాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఏసీబీ వలకు చిక్కారు.

ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసు లో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, సెక్షన్ 35 BNSS (పూర్వపు 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.

సోమవారం ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద బాధితుడి నుంచి ఈ లంచం మొత్తాన్ని బాబు నాయక్ స్వీకరిస్తుండగా, ఏసీబీ సిటీ రేంజ్-II అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.

 ఏసీబీ అధికారులు నిందితుల వద్ద నుంచి లంచం సొమ్ము రూ. 1,00,000 స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన ఈ ఇద్దరు ఎస్ఐలను అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.

 ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

కామెంట్లు